ఎల్బీనగర్:
ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా పనిచేసి,నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్గా పదోన్నతి పై వెళ్తున్న హేమంత్ కేశవ్ పాటిల్కు స్థానిక నేతలు,మాజీ కార్పొరేటర్లు, కాలనీ వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన పదవీకాలం లో చేసిన అభివృద్ధి పనులను గుర్తుచేసుకుంటూ, జోనల్ కార్యాలయంలో ఆయనను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
టీపీసీసీ అధికార ప్రతినిధి,మాజీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ల పాల్గొన్నారు.జోనల్ కమిషనర్గా హేమంత్ కేశవ్ పాటిల్ అందించిన సేవలు అభినందనీయమన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని కొనియాడారు. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పరిపాలనను ప్రజల చెంతకు చేర్చారని పేర్కొన్నారు.
హయత్ నగర్, లింగోజిగూడ సహా నియోజకవర్గంలోని పలు డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన విశేషంగా కృషి చేశారని నాయకులు గుర్తుచేశారు. అభివృద్ధి పనుల కోసం నిధుల కేటాయింపులోనూ, పనుల నాణ్యతను పర్యవేక్షించడంలోనూ ఆయన కనబరిచిన చొరవతో ఎల్బీనగర్ ప్రాంతం ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. అదే సేవా దృక్పథంతో నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, రంగా నరసింహ గుప్తా, పవన్ కుమార్, బద్దం ప్రేమ్ మహేష్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు హయత్ నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు గంగాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోవింద చారి, లింగోజిగూడ జనప్రియ కాలనీ అసోసియేషన్ సభ్యులు రాజకీయ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









