TG 5, సంగారెడ్డి ప్రతినిధి:
సదాశివపేట పట్టణంలో ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కల్పించే దిశగా మరో ముందడుగు పడింది. పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన హెచ్ పి వి ఆరోగ్య శిబిరం అత్యంత విజయవంతంగా ముగిసింది. మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ నివారణకు దోహదపడే ఈ హెచ్ పి వి వ్యాక్సిన్ మరియు ఆరోగ్య పరీక్షలపై ప్రజలకు ఈ శిబిరం ద్వారా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ అంజమ్మ , అలాగే 13వ వార్డు కౌన్సిలర్ ఎర్ర విశాలి నాగరాజ్ గౌడ్ హాజరయ్యారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య సేవలను, శిబిరం జరుగుతున్న తీరును వారు స్వయంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ అంజమ్మ మాట్లాడుతూ… మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఇటువంటి ఉచిత ఆరోగ్య శిబిరాలను సదాశివపేట ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.వార్డు కౌన్సిలర్ ఎర్ర విశాలి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ… 13వ వార్డుతో పాటు పట్టణంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం కృషి చేస్తామని, ఇలాంటి అవగాహన శిబిరాలు మరిన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.









