TG 5, సంగారెడ్డి ప్రతినిధి
• ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు పలు సూచనలు.
కొండాపూర్ మండలం అలియాబాద్, కంది గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐఎఎస్., మరియు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్., సందర్శించారు.
ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు అండగా నిలుస్తూ అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల భద్రతా పరమైన ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ తెలిపారు. అవసరాన్ని బట్టి రవాణా వాహనాలు అందుబాటులో ఉండేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన ధాన్యాన్ని అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలో విక్రయించకుండా చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతలు పరిరక్షించడంతో పాటు రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.









