మధ్యప్రదేశ్లోని వివాదాస్పద ధార్ భోజ్శాల-కమాల్ మౌలా మసీదు ప్రాంగణంపై మధ్యప్రదేశ్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ సంచలన తీర్పులో భోజ్శాల ప్రాంగణం హిందువులదేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య నలుగుతున్న ఈ వివాదానికి కోర్టు తీర్పుతో ఒక స్పష్టత వచ్చినట్లయింది. పురాతన ఆధారాలు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నివేదికను పరిశీలించిన తర్వాతే ధర్మాసనం ఈ ముగింపుకు వచ్చింది.
ఈ ప్రాంగణంలో గతంలో నిర్వహించిన శాస్త్రీయ సర్వే నివేదికను కోర్టు నిశితంగా పరిశీలించింది. ఏఎస్ఐ సమర్పించిన నివేదిక ప్రకారం.. అక్కడ ముస్లింల కంటే ముందే హిందూ నిర్మాణ శైలి, వాస్తు గుర్తులు మరియు సరస్వతి దేవి ఆలయ అవశేషాలు ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ బలమైన శాస్త్రీయ ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఈ భూమి హిందూ సమాజానికే చెందుతుందని పేర్కొంటూ తీర్పునిచ్చింది.
ఈ తీర్పు నేపథ్యంలో ధార్ ప్రాంతంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దశాబ్దాలుగా నడుస్తున్న ఈ వివాదంపై కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తుండగా, ముస్లిం పక్షాలు మాత్రం ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చారిత్రాత్మక తీర్పు దేశవ్యాప్తంగా మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.








