TG 5, సంగారెడ్డి ప్రతినిధి
- 3000 ఎకరాలకు గంగ కత్వ ద్వారా సాగునీరు
- దశాబ్దాలుగా ఆధునీకరణ కు నోచుకోని నిజాం కాలం నాటి గంగ కత్వ కాలువ
- నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారుల తో సెక్రటేరియట్ లో సమావేశమైన జగ్గారెడ్డి
- గంగ కత్వ ఆధునీకరణ పనులకు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి తో శంఖుస్థాపన
సదాశివపేట మండలం సూరారం గ్రామం నుండి మొదలయ్యే నిజాం కాలం నాటి గంగ కత్వ కాలువ ఆధునీకరణ కు జగ్గారెడ్డి చొరవతో ఎట్టకేలకు మోక్షం లభించింది. నిజాం కాలం లో నిర్మించిన ఈ కాలువ ఇప్పటివరకు మరమ్మత్తు కు నోచుకోలేదు. దశాబ్దాల పాటు మరమ్మత్తుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపుతున్న పనులకు మోక్షం కలుగలేదు. గంగ కత్వ ఆయకట్టు రైతులు , స్థానిక నేతల కోరిక మేరకు జగ్గారెడ్డి రెండు నెలల క్రితం నీటి పారుదల శాఖ అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆధునీకరణ పనుల కోసం వెంటనే కొత్త ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. కాలువ ఆధునీకరణ పనులకోసం నీటి పారుదల శాఖ అధికారులు రూ.42 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ఆ ప్రతిపాదనలకు ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో సెక్రటేరియట్ లో జగ్గారెడ్డి సమావేశం అయ్యారు. గంగకత్వ కాలువకు చేపట్టబోయే ఆధునీకరణ పనులపై ఈ సమావేశం లో చర్చించారు.
ఆధునీకరణ పనులు ఇలా…
గంగ కత్వ కాలువ సదాశివపేట మండలం సూరారం గ్రామం లో ప్రారంభం అయ్యి 11 గ్రామాలను కలుపుతూ సదాశివపేట మండలం లోని మాచిరెడ్డి పల్లి గ్రామం వరకు సుమారు 15 కిలో మీటర్ల పొడవునా విస్తరించి ఉంది. గంగకత్వ కాలువ కు 33 చెరువుల నుండి ఫీడర్ చానల్స్ ఉన్నాయి. ఆధునీకరణ పనుల్లో భాగంగా కాలువకు లైనింగ్ పనులు చేపడతారు. కాలువ పైన అవసరం ఉన్న చోట కొత్త బ్రిడ్జి ల నిర్మాణం, పాత వాటికి మరమ్మత్తు పనులు చేస్తారు. దీనితో పాటు కాలువ పొడవునా తుములకు రిపేర్లు చేస్తారు. ఈ కాలువ పనులు పూర్తయితే 3000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు.
సీఎం రేవంత్ రెడ్డి తో శంకుస్థాపన
సీఎం రేవంత్ రెడ్డి త్వరలో సంగారెడ్డి కి రానున్న నేపథ్యం లో గంగకత్వ పనులకు సైతం సీఎం తో శంకుస్థాపన చేయించేందుకు జగ్గారెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు త్వరత గతిన ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశం లో అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి చేతుల మీదుగా గంగ కత్వ పనులకు శంకుస్థాపన జరుగుతుందని జగ్గారెడ్డి అధికారులకు వివరించారు.









