శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం ఆరోగ్యానికి ఎంతో కీలకం. అయితే, కొందరిలో కాళ్లలోని లోతైన సిరల్లో రక్తం గడ్డకడుతుంది. దీనిని వైద్యభాషలో ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ (DVT) అంటారు. కాళ్లలో గడ్డకట్టిన ఈ రక్తపు ముక్కలు (Blood clots) రక్తప్రవాహం ద్వారా ప్రయాణించి, ఊపిరితిత్తుల్లోని ధమనులకు చేరుకుని అక్కడ రక్తప్రసరణను అడ్డుకుంటాయి. ఈ ప్రమాదకరమైన పరిస్థితినే ‘పల్మనరీ థ్రోంబోఎంబోలిజం’ (Pulmonary Thromboembolism) అంటారు. దీనివల్ల ఊపిరితిత్తులకు వెళ్లే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ వ్యాధి బారిన పడినప్పుడు శరీరంలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. బాధితుల్లో అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది (ఆయాసం) కలగడం, ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడం, మరియు దగ్గినప్పుడు రక్తం పడటం వంటివి జరుగుతాయి. దీనితో పాటు గుండె వేగంగా కొట్టుకోవడం, తల తిరగడం, స్పృహ తప్పిపోవడం వంటి సంకేతాలు కూడా కనిపిస్తాయి. ప్రాథమికంగా కాళ్లలో రక్తం గడ్డకట్టినప్పుడు ఒక కాలు వాపు రావడం, సదరు కాలు నడుస్తున్నప్పుడు విపరీతంగా నవ్వడం లేదా ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
పల్మనరీ థ్రోంబోఎంబోలిజం అనేది అత్యంత అత్యవసరమైన వైద్య పరిస్థితి (Medical Emergency). ఎక్కువ సమయం ఒకే చోట కూర్చోవడం, సుదీర్ఘ ప్రయాణాలు చేయడం, ఇటీవల పెద్ద శస్త్రచికిత్సలు జరగడం వంటి కారణాల వల్ల ఈ ముప్పు పెరుగుతుంది. పైన పేర్కొన్న లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. సకాలంలో గుర్తిస్తే బ్లడ్ తిన్నర్స్ (రక్తాన్ని పలచబరిచే మందులు) మరియు ఇతర ఆధునిక చికిత్సల ద్వారా ప్రాణాపాయం నుండి సులభంగా బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.









