తెలంగాణ రాష్ట్రంలో చికెన్ ధరలు అమాంతం కొండెక్కి కూర్చున్నాయి. సామాన్యులు, మాంసాహార ప్రియులు ఆదివారం వస్తే చాలు చికెన్ షాపుల ముందు క్యూ కట్టేవారు, కానీ ఇప్పుడు ఆ ధరల బోర్డులు చూసి వెనకడుగు వేస్తున్నారు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే కిలో చికెన్ ధర భారీగా పెరిగిపోయి సామాన్యుడికి షాక్ ఇస్తోంది. రిటైల్ మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ ధర ఏకంగా కిలో రూ. 300 మార్కును దాటి పరుగులు పెడుతుండగా, లైవ్ (బతికున్న) కోడి ధర కూడా రూ. 150 నుంచి రూ. 170 వరకు పలుకుతోంది. దీంతో ముక్క లేనిదే ముద్ద దిగని మాంసాహార ప్రియులు, బాయిలర్ కోడి కొనాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ అనూహ్య ధరల పెరుగుదలకు ప్రధానంగా మండుతున్న ఎండలే కారణమని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రతకు ఫామ్లలో కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతుండటంతో ఉత్పత్తి భారీగా పడిపోయింది. దీనికి తోడు కోళ్ల దానా, దాణా తయారీకి వినియోగించే ముడిసరుకుల ధరలు, రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరగడం బర్డెన్గా మారింది. మరోవైపు, ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటం, ఇతర శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో చికెన్కు మార్కెట్లో డిమాండ్ అమాంతం పెరిగింది. ఒకపక్క ఉత్పత్తి తక్కువగా ఉండటం, మరోపక్క డిమాండ్ విపరీతంగా పెరగడమే ఈ ధరల మంటకు అసలు కారణం.
చికెన్ ధరలు ఇలా చుక్కలు చూపిస్తుండటంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రతి ఆదివారం కిలో చికెన్ కొనే కుటుంబాలు ఇప్పుడు బడ్జెట్ చూసుకుని అరకిలోతోనే సరిపెట్టుకుంటున్నాయి. మరోవైపు ఈ ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్, కర్రీ పాయింట్ల పైనా తీవ్రంగా పడింది. గత్యంతరం లేక చికెన్ వంటకాల ధరలను యజమానులు పెంచేస్తున్నారు, లేదా ప్లేటులో ఇచ్చే పరిమాణాన్నైనా తగ్గించేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో, వర్షాలు పడి వాతావరణం చల్లబడే వరకు చికెన్ ధరలు ఇప్పట్లో దిగివచ్చే అవకాశం లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.









