తెలంగాణ ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో నేడు నిర్వహించిన భారీ జాబ్ మేళా కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి మేళాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ డీసీసీ అధ్యక్షులు మరియు కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి , ఎమ్మెల్యే కే. ఆర్.నాగరాజు , కలెక్టర్ సత్య శారదా దేవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి కొండా సురేఖ చొరవతో హనుమకొండ జిల్లాలో ఇలాంటి భారీ జాబ్ మేళాలు నిర్వహించడం సంతోషకరం. స్థానిక యువతకు కంపెనీలలో ఉద్యోగాలు దక్కడం గొప్ప విషయం” అని అన్నారు.
యువత కేవలం డిగ్రీలతో ఆగిపోకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ మేళాను సద్వినియోగం చేసుకుని ఎంపికైన యువత క్రమశిక్షణతో పనిచేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో DYSO హనుమకొండ, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు మరియు పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.









