ప్రజలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లినప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న చిన్న ఫిర్యాదులకైనా పత్రాలు సరిగా లేవంటూ ఒకటికి రెండు సార్లు తిరగదొర్లిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డబ్బులు, బంగారం వంటి అంశాలపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే, బాధితులను ప్రశ్నిస్తూ “మీ వద్ద అంత సొమ్ము ఎక్కడిది?” అంటూ ఎదురు ప్రశ్నలు వేయడం జరుగుతోంది.
ఇలా పలుమార్లు తిరిగేలా చేసి కేసులు నమోదు చేయకుండా కాలయాపన చేస్తూ, కొంతమంది మధ్యవర్తుల ద్వారా లంచాలు కోరుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు న్యాయం కోసం వెళ్లి మరింత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ పరిస్థితుల వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ వ్యవస్థపై నమ్మకం తగ్గిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. న్యాయం దొరకదనే భావనతో కొందరు ప్రైవేట్ సెటిల్మెంట్లకు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ప్రైవేట్ వ్యక్తులు లాభపడుతూ, అధికారులే పరోక్షంగా ఆ దిశగా దారి చూపుతున్నట్లుగా భావిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులు మారితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, వ్యవస్థపై విశ్వాసం పునరుద్ధరించబడుతుందని ప్రజలు కోరుతున్నారు. అధికారులు స్పందించి పారదర్శకంగా వ్యవహరించాలని, బాధితులకు వేగంగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.









