నేరేడ్మెట్ పోలీసుల ఆధ్వర్యంలో సాయినాథపురం లోని ప్రశాంత్ గార్డెన్లో నిర్వహించిన ఈ సమావేశానికి పలు కాలనీలు, అపార్ట్మెంట్ల నుండి అధిక సంఖ్యలో మహిళలు, యువకులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి బి. సుమతి, IPS మాట్లాడుతూ “మీ సురక్ష” యాప్ ద్వారా ప్రజలకు అందే సేవలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను వేగంగా సంప్రదించే విధానం గురించి వివరించారు. అలాగే రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్ కాల్స్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా మోసాల నుంచి ఎలా జాగ్రత్త పడాలో ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమాన్ని నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ సుధాకర్, ఏసీపీ యాదగిరి రెడ్డి, సైబర్ క్రైమ్ అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను అధికారులు వివరించగా, కార్యక్రమానికి హాజరైన ప్రజలు ఆసక్తిగా విన్నారు.
ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు మరింత ఉపయోగకరంగా ఉంటాయని పలువురు అభిప్రాయపడ్డారు.









