ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేళ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వేసవిలో డిమాండ్ ఎంత పెరిగినా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉండకూడదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారికంగా లేదా అనధికారికంగా ఎక్కడా విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి వీల్లేదని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందించాలని ఆయన అధికారులను కోరారు.
తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి విద్యుత్ సంస్థల సీఎండీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి ప్రస్తుత సరఫరా పరిస్థితిపై సమీక్షించారు. రాష్ట్రంలో తగినంత విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వస్తున్న ఫిర్యాదులపై ఆయన ఆరా తీశారు. అధిక వేడి వల్ల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం లేదా సాంకేతిక సమస్యల వల్ల సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని అధికారులు వివరణ ఇవ్వగా, అటువంటి సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.
ముఖ్యంగా విద్యుత్ సరఫరాలో ఏవైనా అంతరాయాలు ఏర్పడితే, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని మంత్రి సూచించారు. సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, సమస్యలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడటమేనని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.









