వైద్య విద్య కోసం ఆదివారం నిర్వహించనున్న ‘నీట్’ పరీక్షకు వరంగల్ పోలీస్ యంత్రాంగం పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హన్మకొండ (4), కాజీపేట (3), వరంగల్ (2), జనగామ (2) ప్రాంతాల్లోని మొత్తం 11 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. పరీక్షా సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (పాత 144 సెక్షన్) అమలులోకి తెచ్చారు. ఈ ఆంక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ముగ్గురికంటే ఎక్కువ మంది గుమికూడటం, సభలు, ర్యాలీలు, ధర్నాలు చేయడంపై పూర్తి నిషేధం విధించారు. అంతేకాకుండా, కేంద్రాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్ దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.









