గతంలో వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల మీద కేసు నమోదు చేయమని ప్రభుత్వం ఎలా ఆదేశిస్తుందని, అసలు కేసు పెట్టమని అధికారం ఎవరిచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయడం సహజమని, దానికి క్రిమినల్ చర్యలు ఎలా తీసుకుంటారని ధర్మాసనం నిలదీసింది.
విచారణ సందర్భంగా, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్ల వ్యక్తిగతంగా ఎవరైనా నష్టపోతే వారు కోర్టును ఆశ్రయించవచ్చు కానీ, ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా ఫిర్యాదు చేయించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో అనుసరించిన నిబంధనలను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. రాజకీయ విమర్శలను చట్టపరమైన కేసులతో అణచివేయడం సరికాదనే అభిప్రాయాన్ని న్యాయమూర్తి వ్యక్తం చేశారు.
అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో (G.O.) చట్టబద్ధతను కూడా హైకోర్టు ప్రశ్నించింది. పవన్ కల్యాణ్పై కేసు నమోదుకు ఆధారమైన ఉత్తర్వులపై పూర్తి వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో పవన్ కల్యాణ్ తరపు న్యాయవాదులు వాదిస్తూ.. అది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తదుపరి విచారణను వాయిదా వేస్తూ, కేసు డైరీని సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.









