ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఫ్లెక్సీలు మరియు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణల సంస్కృతిపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఎవరిని ధ్వంసం చేస్తారు? 2029లో ధ్వంసం చేయాలని ఎదురు చూస్తున్నారా? రాష్ట్రాన్నా లేక ప్రజలనా?” అంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం కనిపిస్తోందని కోర్టు మండిపడింది.
వైసీపీ మాజీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్ను (ఎల్ఓసీ) రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. గతంలో న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకున్న వారిపై కఠినంగా వ్యవహరించి ఉంటే నేడు పరిస్థితి ఇలా ఉండేది కాదని కోర్టు అభిప్రాయపడింది. ఒకసారి అరెస్ట్ చేసినా నిందితులు మళ్లీ అదే తరహా పోస్టులు పెడుతుండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపింది.
ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవిలో ఉన్న వారిని అవమానించడం అంటే రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను అవమానించడమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎవరి కుటుంబాన్ని అయినా కించపరిచే హక్కు ఎవరికీ లేదని, ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్పై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.









