ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణం పూర్తి కావడం అసాధ్యమని, అది ఎప్పటికీ ముగియని కథ అని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి అభివృద్ధికి దాదాపు రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. అంత పెద్ద మొత్తాన్ని వెచ్చించి రాజధానిని నిర్మించడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెనుభారంగా మారుతుందని, అది ఆచరణలో సాధ్యం కాని పథకమని ఆయన అభిప్రాయపడ్డారు.
అమరావతికి ప్రత్యామ్నాయంగా “మావిగన్” (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) కారిడార్ను అభివృద్ధి చేయడమే సరైన మార్గమని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇప్పటికే 60 లక్షల జనాభాతో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని కేవలం రూ.20 వేల కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దవచ్చని ఆయన సూచించారు. రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా వర్షం వస్తే మునిగిపోయే లోతట్టు ప్రాంతంలో రాజధానిని నిర్మిస్తారా అని ప్రశ్నిస్తూ, కేవలం 217 చదరపు కిలోమీటర్లకే పరిమితమైన అమరావతి కంటే మావిగన్ ప్రాంతమే అభివృద్ధికి అనువైనదని వివరించారు.
పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించిన అంశంపై స్పందిస్తూ, ఒక ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని మరో ప్రభుత్వం మార్చలేదా అని ఆయన వ్యాఖ్యానించారు. రాజధానిపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా భారీ వ్యయంతో కూడిన అమరావతి కంటే, ఉన్న వనరులను సమర్థవంతంగా వాడుకుంటూ మావిగన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే మేలని ఆయన పునరుద్ఘాటించారు. మాజీ మంత్రి విడదల రజని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.









