సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 6వ వార్డు నందమూరి నగర్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆదివారం శుభారంభం జరిగింది. బోర్డు నిధులతో రూ.6 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనులను సివిలియన్ నామినేటెడ్ బోర్డు సభ్యురాలు భానుక నర్మద ప్రారంభించారు. స్థానిక ప్రజలు పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలకు స్వాగతం పలికారు. ఈ పనులు పూర్తయ్యాక ప్రాంతంలో చాలా కాలంగా ఉన్న మురుగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు.
ఈ సందర్భంగా భానుక నర్మద మాట్లాడుతూ, తాను 2008లో ఎన్నికైన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చానని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ల మంజూరులో 80 మందికి పైగా ప్రయోజనం చేకూర్చినట్టు చెప్పారు. ప్రతి లైన్లో భూగర్భ డ్రైనేజీ సదుపాయం కల్పించేందుకు ఆ సమయంలో ప్రారంభించిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. ప్రాంత ప్రజల అభ్యర్థనల మేరకు సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేశానని చెప్పారు.
త్రాగునీటి సమస్యలు అధికంగా ఉన్న సమయంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా కారణంగా ప్రమాదాలు పెరిగాయని నర్మద గుర్తుచేశారు. ఈ విషయాన్ని అప్పటి సిఈఓ సుజాత గుప్తా దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే ఒక కోటి రూపాయల బోర్డు నిధులు పైపులైన్ నిర్మాణానికి మంజూరు చేశారని తెలిపారు. పైపులైన్ శంకుస్థాపన జరిగినప్పటికీ తరువాత ఎన్నికలు రావడంతో పనులు పూర్తికాలేదని చెప్పారు. ఇప్పుడు వాటిని పునరుద్ధరించి ముందుకు తీసుకెళ్లే చర్యలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న డ్రైనేజీ పనులతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో జరుగనున్నాయని భానుక నర్మద ప్రకటించారు. మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ బోర్డు మార్గదర్శకత్వంలో పలువురు పనులు ప్రతిపాదిత స్థాయిలో ఉన్నాయని తెలిపారు. ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కలిసికట్టుగా పని చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, బస్తీ నివాసులు పాల్గొన్నారు.









