క్షణకాలం నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలిగొంటున్న ప్రస్తుత తరుణంలో, వాహనదారుల్లో మార్పు తెచ్చేందుకు పోలీస్, రవాణా శాఖలు సంయుక్తంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం సర్వత్రా ఆలోచింపజేస్తోంది. హనుమకొండ జిల్లా చింతగట్టు కేఎల్ఎన్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో అడిషనల్ డీజీపీ చారు సిన్హా, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, డీటీసీ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొని సురక్షిత ప్రయాణ ప్రాముఖ్యతపై దిశానిర్దేశం చేశారు. అతివేగం, మద్యం మత్తు, హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే అనర్థాలను కళ్లకు కట్టినట్లు చూపిన దృశ్యరూపకాలతో పాటు, రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన బాలుడు రుత్విక్ చెప్పిన మాటలు సభికులను కంటతడి పెట్టించాయి. ఇంటి వద్ద మనకోసం ఎదురుచూసే కుటుంబ సభ్యులను గుర్తుంచుకుని బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని, అవసరమైన వారు తప్పనిసరిగా కంటి అద్దాలు వాడాలని అధికారులు సూచించారు. అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు, వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి, ట్రాఫిక్ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటిస్తూ సురక్షిత ప్రయాణం సాగిస్తామని సభికులందరితో ప్రతిజ్ఞ చేయించారు.









