రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ తీసుకుంటున్న చర్యలు ఎర్రచందనం అక్రమ రవాణాపై సత్ఫలితాలు చూపిస్తున్నాయి. ఆయన ఇచ్చిన భరోసా ప్రజల్లో చైతన్యం నింపింది. పవన్ స్ఫూర్తితో చిత్తూరు జిల్లా, అప్పినపల్లి గ్రామస్తులు ఎర్రచందనం దొంగల ఆటకట్టడానికి ముందుకొచ్చారు.
అప్పినపల్లి గ్రామ ప్రజల సహకారంతో అటవీశాఖ అధికారులు శుక్రవారం ఉదయం అక్రమంగా రవాణా అవుతున్న 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులు తమ భద్రతను పక్కన పెడుతూ ఈ ఆపరేషన్లో పాల్గొని డ్రైవర్, దొంగలను వెంబడించారు. పవన్ కల్యాణ్ ఈ ధైర్యాన్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
శుక్రవారం ఉదయం తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ పులిచర్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక అనుమానాస్పద వాహనం వేలు దూసుకువెళ్లింది. అటవీ అధికారులు వెంటనే వెంబడించగా, మార్గ మధ్యలో వాహనం నుంచి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. డ్రైవర్ కూడా వాహనాన్ని ఒక పక్కన ఆపి పారిపోయాడు.
తనిఖీ సమయంలో వాహనంలో ఉన్న 10 ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి చేరింది. గ్రామస్తులు చూపిన చొరవ, ధైర్యాన్ని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. అటవీశాఖ అధికారులు, పోలీసులు కూడా ఈ విజయానికి గర్వంతో నిలిచారు.









