తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ పార్టీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు కార్యకర్తలందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రస్తుత కూటమి ఐక్యత అత్యంత కీలకమని, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
దివంగత నందమూరి తారక రామారావు గారు ‘తెలుగువారి ఆత్మగౌరవం’ అనే నినాదంతో స్థాపించిన టీడీపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పులు తెచ్చిందని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో బలంగా నిలబడటం వెనుక గొప్ప పోరాట చరిత్ర ఉందని కొనియాడారు. పార్టీ ఎదుర్కొన్న ఎన్నో క్లిష్ట పరిస్థితులను, రాజకీయ ఒడిదుడుకులను చంద్రబాబు తన అపారమైన అనుభవంతో అధిగమించారని, ఆయన నాయకత్వ పటిమ పార్టీ శ్రేణుల్లో ఎప్పుడూ స్థైర్యాన్ని నింపుతుందని ప్రశంసించారు.
రాజకీయ లక్ష్యాల కంటే రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే అజెండాగా చంద్రబాబు పార్టీని నడిపిస్తున్న తీరు స్ఫూర్తిదాయకమని పవన్ పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రగతిలోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ టీడీపీ తనదైన ముద్ర వేసిందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కూటమి ఐక్యతతోనే సాధ్యమని స్పష్టం చేసిన ఆయన, ఈ స్నేహబంధాన్ని మరింత పటిష్ఠం చేసుకుందామని పార్టీ కార్యకర్తలకు సూచించారు.









