వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ అక్రమాల కలకలం

Illegal land registrations and corruption surfaced at Vanastalipuram Sub-Registrar office; park land misuse led to officer suspension after inquiry.

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలు ఇటీవల వరుస ఘటనలతో బహిర్గతమయ్యాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్‌లు అవినీతి మరియు అక్రమ రిజిస్ట్రేషన్ల కారణంగా వేటు పడటం స్థానిక ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో సబ్‌రిజిస్ట్రార్ రాజేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ చేతికి చిక్కడంతో పదవి ఖాళీ అయింది. అదే సమయంలో సీనియర్ అసిస్టెంట్ శివశంకర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించగా, ఆయన కూడా వివాదాస్పద రిజిస్ట్రేషన్‌లో ఇరుక్కొన్నారు.

వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లే మార్గంలో సాహెబ్‌నగర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని 200 సర్వే నంబర్‌లో జీహెచ్ఎంసీకి చెందిన పార్కు స్థలం ఉంది. గతంలో గ్రామపంచాయతీ అనధికారిక లేఅవుట్ ఆధారంగా ఈ ప్రాంతంలో అనేక రిజిస్ట్రేషన్లు జరిగాయి. కోర్టుల అనుమతులతో కొందరు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటుండగా, అదే ఉపాధానంగా కొంతమంది పార్కు స్థలాన్ని కూడా బై నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నించారు. సబ్‌రిజిస్ట్రార్ శివశంకర్‌ ఈ ప్రక్రియను పరిశీలించకుండా నేరుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం వివాదాస్పదమైంది.

స్థానికులు ఈ వ్యవహారంపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు విపులమైన విచారణ చేపట్టారు. విచారణలో పలు డాక్యుమెంట్లకు ఒకే ఫొటోలు ఉపయోగించడం, పార్కు స్థలం ఉన్నట్లు ప్రజలు చెప్పినా పట్టించుకోకపోవడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరైన ధృవీకరణ లేకుండా పూర్తి చేయడం వంటి లోపాలు బయటపడ్డాయి. ఈ సందర్భంలో శివశంకర్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం.

ఇటీవల ఏసీబీ దాడుల తరువాత స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఉన్న లోపాలపై ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కీలక సంస్కరణలు అమల్లోకి వచ్చినప్పటికీ, కొందరు అధికారులు, సిబ్బంది మాత్రం తమ విధానంలో మార్పు చూపకపోవడం ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. వరుస అవకతవకలు వెలుగులోకి రావడం ప్రజల్లో ఆగ్రహం కేకలు రేపుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై మరింత పర్యవేక్షణ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share