పీరియడ్స్ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత కోసం శానిటరీ ప్యాడ్స్ వాడటం సాధారణం. కానీ తాజాగా టాంపోన్స్ అనే ఆధునాతన హైజీన్ ప్రొడక్ట్స్ వినియోగం పెరుగుతోంది. పత్తి లేదా రేయాన్ పదార్థంతో తయారు చేసే ఈ సిలిండర్ ఆకారపు ఉత్పత్తులను మహిళలు అంతర్గతంగా ఉపయోగిస్తారు. అయితే యూకేలో జరిగిన ఒక తాజా అధ్యయనం ప్రకారం, టాంపోన్స్ సాధారణ శానిటరీ ప్యాడ్స్తో పోలిస్తే అంత సురక్షితం కావని తేలింది.
ఆ అధ్యయనంలో టాంపోన్స్లో గ్లైఫోసేట్ అనే పురుగుమందు అవశేషాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇవి తాగునీటిలో అనుమతించబడిన మోతాదుకంటే 40 రెట్లు అధికంగా ఉన్నాయని వెల్లడైంది. గ్లైఫోసేట్ వ్యవసాయంలో ఉపయోగించే పురుగుమందు కాగా, దీని అధిక వాడకం క్యాన్సర్, హార్మోన్ అసమతుల్యత, సంతానోత్పత్తి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది.
టాంపోన్స్లో ఉన్న రసాయనాలు శరీరంలోని సహజ రక్షణ వ్యవస్థను దాటుకుని నేరుగా రక్తప్రవాహంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. దీర్ఘకాలికంగా వాడితే టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (TSS) అనే తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా 8 గంటలకు మించి టాంపోన్స్ యోని భాగంలో ఉంచడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే టాంపోన్స్లో ఉండే బ్లీచ్, డైయాక్సిన్, రేయాన్ వంటి రసాయనాలు చర్మ అలర్జీలు, దురదకు కారణమవుతాయి. పత్తితో తయారైన టాంపోన్స్లో గ్లైఫోసేట్ ఉంటే అది రక్తప్రవాహంలోకి చేరి హార్మోన్ అసమతుల్యతకు దారితీయవచ్చు. ప్లాస్టిక్ లేదా రేయాన్ టాంపోన్స్ బయోడిగ్రేడ్ కాకపోవడం వల్ల పర్యావరణ కాలుష్యానికి కూడా కారణమవుతాయి. అందుకే నిపుణులు సాధారణ శానిటరీ ప్యాడ్స్ లేదా పరిశుభ్రమైన గుడ్డ వాడకాన్ని ఆరోగ్యానికి మేలుగా సూచిస్తున్నారు.









