ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొంటూ, జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ములుగు రూపురేఖలను మార్చబోతున్నాయని అన్నారు. గురువారం వెంకటాపూర్ మండలంలోని రామప్ప సరస్సు వద్ద రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టిన ద్వీప అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీ.ఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రామప్ప సరస్సులో శివుడి విగ్రహం ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిధులు మంజూరైనట్లు తెలిపారు. సరస్సు మధ్య ఉన్న 20 ఎకరాల విస్తీర్ణంలో ఏడు ఎకరాలపై టూరిజం శాఖ ఆధ్వర్యంలో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టినట్లు వివరించారు. రామప్ప ఆలయానికి ఇప్పటికే యునెస్కో గుర్తింపు రావడం ములుగు గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో పెంచిందని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో యోగా, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనువైన వేదికగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధితో పాటు విద్య, వైద్యం రంగాల్లో కూడా విశేష పురోగతి సాధించామని సీతక్క తెలిపారు. హంపి థియేటర్ ప్రాజెక్ట్, యంగ్ ఇండియా పాఠశాల భవన నిర్మాణం, విలేజ్ పార్క్లు, ఆయిల్ ప్రొడక్షన్ యూనిట్లు వంటి ప్రాజెక్టులు ఈ జిల్లాలో రూపుదిద్దుకుంటున్నాయని వివరించారు. లక్నవరం సరస్సు వద్ద కొత్త ఐలాండ్లు, బోగత జలపాతం వద్ద వంతెన నిర్మాణం వంటి పనులు పర్యాటకులను ఆకర్షించేలా ఉంటాయని అన్నారు.
ములుగు జిల్లాలో సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, లింక్ రోడ్లతో సహా మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. గత పది సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత అభివృద్ధి తమ పాలనలో సాధ్యమైందని అన్నారు. కాకతీయుల చరిత్రను సజీవంగా నిలబెట్టి, సమ్మక్క సారక్క ఆత్మను ప్రతిబింబించేలా ములుగును అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. భావితరాలకు ప్రేరణగా నిలిచే ములుగు రూపకల్పనలో ప్రజల సహకారం అవసరమని సీతక్క పిలుపునిచ్చారు.









